సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రంలో వెలసిన శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం, మాస శివరాత్రి ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారికి 1001 కిలోల వివిధ రకాల పుష్పాలతో కనుల విందుగా పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
మేళ్లచెరువు శ్రీ చండీ పీఠం వ్యవస్థాపకులు,వేద పండితులు కొంకపాక రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ముందుగా శ్రీ విఘ్నేశ్వర పూజ నిర్వహించి,వేద మూర్తుల నమక,చమక, రుద్ర,మహాన్యాస,పంచ సూక్తం పఠనంతో పంచామృతాలతో,వివిధ పళ్ళ రసాలతో, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం అభిషేకం నిర్వహించారు.
అనంతరం వేద మూర్తులైన బ్రాహ్మణోత్తములు శివ సహస్ర నామాల పఠనంతో 1001 వివిధ రకాల జాతుల సుగంధ భరిత పుష్పాలతో శ్రీ ఇష్ట కామేశ్వరీ సమేత శ్రీ స్వయంభ శంభు లింగేశ్వర స్వామివారికి నిలువెత్తు పుష్పార్చన,మారేడు త్రిదళార్చన అత్యంత వైభవోపేతంగా,భక్త సందోహ వీనుల విందుగా నిర్వహించారు.
పుష్పార్చన కార్యక్రమం అనంతరం స్వామివారిని అలంకరించి, కళ్యాణం నిర్వహించి ధూప,దీప నైవేద్య,మహా నీరాజనం మంత్రపుష్పం సమర్పించిన పిదప భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం,అన్నప్రసాద వితరణ గావించారు.
ఈ కార్యక్రమంలో కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ,ధనుంజయ శర్మ,శివ శర్మ,యాతవాకిళ్ళ భాను కిరణ్ శర్మ,హరి లక్ష్మణ కుమార్ శర్మ, వారణాసి మధు శర్మ,వెంకటేశ్వర శర్మ, ఆలయ మేనేజర్ సత్యనారాయణ, అధిక సంఖ్యలో భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పాల్గొని స్వామివారి పుష్పయాగాన్ని కనులారా తిలకించి ధన్యత చెందారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్