ఖమ్మంలో పొంగులేటి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం చూసి పువ్వాడ అజయ్ కుమార్ కు పూనకం వచ్చిందని, వచ్చిన జనసందోహాన్ని చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఏమేమో మాట్లాడుతున్నాడని పొంగులేటి అనుచరుడు మువ్వా విజయ బాబు ఫైర్ అయ్యాడు. శ్రీనివాస రెడ్డి క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మువ్వా మాట్లాడుతూ.. పొంగులేటి అడగడం వల్లే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చాయని, ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యతను మాత్రం పొంగులేటి తీసుకుంటాడని తెలిపారు. 30 ఏళ్ల పాటు కాంట్రాక్టర్ గా కష్టపడ్డ పొంగులేటి ఇప్పుడు ఈ స్థాయికి
వచ్చాడని… కూనవరంలో దేంతో మీ ప్రస్థానం మొదలైంది.. ఖమ్మంలో కోట్లకు ఎలా పడగలెత్తారో చెప్పాల్సిన అవసరం మీకుందని పువ్వాడను ప్రశ్నించారు. పొంగులేటి అక్రమంగా సంపాదించాడని ఇప్పుడు మాట్లాడుతున్న మీరు.. మీ పార్టీలో ఉన్నప్పుడు ఈ విషయం గుర్తుకురాలేదా? అని నిలదీశారు. కొత్త బస్టాండ్ నిర్మాణ వ్యయాలేంటి?, గోళ్లపాడు ఛానల్ ద్వారా దండుకున్నదెంత? అందరికీ తెలుసన్నారు.
బైరటీస్ అక్రమ వ్యవహారంపై త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. డీసీసీబీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అన్నింటికి లెక్కలున్నాయని వెల్లడించారు. ఈ విషయమై అష్టలక్ష్మీ గుడి దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధం.. నీవు సిద్ధమా అంటూ పువ్వాడకు సవాల్ విసిరారు. పార్టీ ఆఫీసులో నీ ఫొటో తీసేశారని, మొదట నీ పక్కన ఉన్న కట్టప్పల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో నీ ఓటమి తప్పదు గుర్తుంచుకో అంటూ మువ్వా ఫైర్ అయ్యాడు. మద్దినేని బేబీ స్వర్ణకుమారి మాట్లాడుతూ పువ్వాడ నాగేశ్వరరావు పేరు చెడగొట్టొద్దని మంత్రి అజయ్ కుమార్ కు సూచించారు శ్రీనివాస రెడ్డి పై ఆరోపణలు మానుకొని ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
కార్పొరేటర్ దొడ్డా నగేశ్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో పువ్వాడపై పోటీచేసి గెలిచే బచ్చాను నేనే అని, అనవసరమైన మాటలతో కాలయాపన చేయకుండా పోటీకి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మందడపు తిరుమల రావు, బోడా శ్రావణ్, మియా భాయ్, దుంపల రవి కుమార్, మందడపు నాగేశ్వరరావు , దుర్గా, నాగరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.