కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ తప్పుకునే ఆలోచనలో ఉన్నందున ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ నే ఆ పదవిని చేపట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ ఒక తీర్మానం చేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి పంపింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని సోనియా తన సన్నిహితులతో అన్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. పార్టీలో సమర్ధ, శాశ్వత నాయకత్వం గురించి 20 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు లేఖ రాయడంపై సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
దీంతో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి పార్టీ నేతలతో సోనియా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సూచిస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై సోనియా గాంధీ ఈ విధంగా స్పందించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గత ఏడాది రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయితే త్వరగా పార్టీ చీఫ్ను ఎన్నుకోవాలనే షరతును ఆమె అప్పుడే విధించారు. అయితే ఈ విషయమై సీడబ్ల్యూసీ సమావేశం సోమవారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీకి ఉమ్మడి నాయకత్వం ఉండాలని కొందరు ప్రస్తుత ఎంపీలు, మాజీ మంత్రులు కోరుతుండగా, రాహుల్ గాంధీ మళ్ళీ బాధ్యతలు చేపట్టాలని మరికొందరు కోరుతున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సోనియా రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు కాంగ్రెస్ వర్గీయుల సమాచారం.