నీట మునిగిన, కూలిన ఇళ్లు, వంతెనలు, కొట్టుకపోయిన రోడ్లు , తెగిపోయిన కాలువలు , రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న కాజ్ వే లను ములుగు జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్ నేడు పరిశీలించారు. ఆయన ములుగు , ఏటూరునాగారం , మంగపేట మండలాలలో విస్తృతంగా పర్యటించారు.
ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామానికి చెందిన నివాస గృహాలు, రామప్ప బ్యాక్ వాటర్ నీటితో మునిగిపోయాయి. దాంతో వారికి ప్రభుత్వం జంగాలపల్లి గ్రామంలోని బ్రహ్మణి పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ వారిని కలిసి పరామర్శించారు.
పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన ఇబ్బందులను జడ్పీ చైర్మన్ దృష్టికి వారు తీసుకు వచ్చారు. మెట్ట ప్రాంతంలో వారికి శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన అన్నారు. అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ లు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో తనకు అందించాలన్నారు.
ఆయన వెంట ములుగు జడ్పీటిసి సకినాల భవాని, ఇంచర్ల సర్పంచ్ రాజయ్య , ఇంచర్ల పిఎసిఎస్ చైర్మన్ రాములు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు రియాజ్ మిర్జా , నాయకులు వినయ్ కుమార్, తదితరులు ఉన్నారు.