వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మంత్రి తన నివాస ప్రాంగణంలో గార్డెన్ లో పూల కుండీలు, వివిధ పాత్రల్లో నిండిన నీటిని శుభ్రపరచి యాంటీ లార్వా మందులను చల్లారు. ఎక్కడైనా నీరు పేరుకుపోయిందేమోనని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపురపాలక, ఐటి శాఖ మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.సర్పంచులు వార్డు మెంబర్లు , కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు.
ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, విషజ్వరాలు వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వీలవుతుందని అన్నారు.
పరిసరాల శుభ్రతతో లార్వా దశలోనే దోమలను అరికట్టవచ్చని తెలిపారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, జడ్పీటీసీ జీవన్ రెడ్డి, ముత్యంరెడ్డి, తదితులు పాల్గొన్నారు.