వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో తిరుగుబావుటా ఎగురవేయడానికి రెడీ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందా? తమ రాజకీయ భవిష్యత్ పై భయం వారిని వైసీపీకీ దూరం చేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే వైసీపీకి లోక్ సభలో ఒక రెబల్ ఎంపీ ఉన్నారు. ఆయనకు తోడుగా మరో ఎంపీ తిరుగుబావుటా ఎగుర వేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సోమవారం వైసీపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయులు లోక్ సభలో చేసిన ప్రసంగం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
లోక్ సభ వేదికగా ఆయన మాట్లాడిన ప్రతి మాటా జగన్ సర్కార్ ను వేలెత్తి చూపినట్లుగానే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను పరొక్షంగా విమర్శించిన కారణంతో జగన్ పార్టీ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కక్ష కట్టింది. కేసులు పెట్టింది. సీఐడీ పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేసినా స్పందించలేదు. అంతే కాదు.. గత కొన్నేళ్లుగా ఆయన కనీసం రాష్ట్రంలో అడుగుపెట్టే పరిస్థితి కూడా లేకుండా చేసింది. సొంత నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగి.. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరైనా కూడా రఘురామకృష్ణంరాజు రాలేకపోయారంటేనే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఇట్టే అవగతమౌతుంది.
ఇప్పుడు అదే కోవలో నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు ప్రభుత్వ డేటాచోరీ అంశంపై పార్లమెంట్లో పరోక్షంగా మాట్లాడి వైసీపీలో కలకలం రేపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చలో పాల్గొని ప్రభుత్వాలు సేకరించే వ్యక్తిగత వివరాలు సంక్షేమ పథకాల అమలు కోసం కాకుండా ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం.. డేటా చౌర్యం, దుర్వినియోగం అనగానే ఎవరికైకా ముందుగా గుర్తుకు వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ వలంటీర్ల ద్వారా జగన్ సర్కార్ డేటా చౌర్యానికి పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అలా చోరీ చేసిన డేటాను హైదరాబాద్ నానక్ రామ్ గూడలో భద్రపరిచారనీ విమర్శించారు.
ఆ చోరీ చేసిన డేటాను ఓ ప్రైవేటు కంపెనీకి చేసి.. ఓటర్లను ఓటర్లను ప్రభావితం చేసే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాయి. వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు లోక్ సభలో డేటా చౌర్యం గురించి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలనే ఏపీ సర్కార్ అన్న మాట ఎత్తకుండా మాట్లాడారు. పేరెత్తి నిజం నిర్భయంగా చెప్పలేకపోయినా.. పరోక్షంగా జగన్ సర్కార్ పై వస్తున్న ఆరోపణలనే ప్రస్తావించి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టేశారు. లోక్ సభలో ఆయన ప్రసంగంపై వైసీపీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
మరో ఎంపీ జగన్ కు రెబల్ గా మారారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లావు ప్రసంగం తరువాత జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది. చాలా కాలంగా లావు కృష్ణ దేవరాయులు జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, అలాగే తనకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ లభించే అవకాశాలు లేవని తన సన్నిహితుల వద్ద పలుమార్లు చెప్పారనీ వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే డేటా చౌర్యంపై లోక్ సభ వేదికగా లావు చేసిన ప్రసంగం అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎంపీల విషయం పక్కన పెడితే.. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ లభించే అవకాశం లేని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలలు కూడా ధిక్కార స్వరం వినిపించేందుకు సిద్ధపడుతున్నారనీ, ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వైసీపీలో అసంతృప్తి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, సొంత పార్టీలోనే జగన్ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతున్నదనీ, నెల్లూరు, తూర్పుగోదావరి సహా పలు జిల్లాలలో నాయకుల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలే తేటతెల్లం చేస్తున్నాయి.