కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రచ్చ ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ రోజు మధ్యాహ్నం వరకు విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డెడ్ లైన్ విధించిన అధికార పార్టీ కౌన్సిలర్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
బీజేపీకి చెందిన 11, 2 వ వార్డులకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఈనెల 17 న పాత రాజంపేట గ్రామంలో జరిగిన రైతు సమావేశంలోనే రాజీనామా లేఖలను రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులకు కౌన్సిలర్లు అందజేశారు. అయితే 19 వ తేదీ మధ్యాహ్నం వరకు కౌన్సిలర్లు రాజీనామా పత్రాలను కార్యాచరణ కమిటీ సబ్యులకు అందజేస్తే అదే రోజు రైతులతో కలిసి కమిషనర్ కు రాజీనామా లేఖలు అందజేస్తారని తీర్మానించారు.
ఇప్పటివరకు బీజేపీకి చెందిన కౌన్సిలర్లు తప్ప అధికార పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేయకపోవడంతో ఇద్దరి రాజీనామా పత్రాలను నేడు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు, కౌన్సిలర్లు మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రెండు రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ కు సూచించారు. లేకపోతే ఈ నెల 23 న మిగిలిన ఐదుగురు బీజేపీ కౌన్సిలర్లు సైతం రాజీనామా చేస్తామని హెచ్చరించారు. తదుపరి రైతుల కార్యాచరణ ప్రకారం ఉద్యమం చేపడతామన్నారు.