అవినీతి సొమ్ముతో వేల ఎకరాల్లో కెసిఆర్ కుటుంబం ఫామ్ హౌస్లు నిర్మించుకుంటుంటే,మంత్రి నిరంజన్ రెడ్డి కూడా వందల ఎకరాల్లో నిర్మించు కుంటున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వనపర్తిలో చెప్పారు. నీళ్ల నిరంజన్ రెడ్డి కాదని, కమిషన్ల నిరంజన్ రెడ్డి అని విమర్శించారు.
ఉద్యమ సమయం లో ఎలాంటి ఆస్తులు లేవన్న నిరంజన్ రెడ్డి ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎలావచ్చాయని అయన ప్రశ్నించారు. కెసిఆర్ మంత్రి వర్గంలో అత్యంత అవినీతి పరుడు నిరంజన్ రెడ్డి అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, అవినీతి సొమ్ముతో కెసిఆర్ కుటుంబం విలాసవంత మైన జీవితం గడుపుతున్నారన్నారు.
మూడవ సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిగిలిపోయిన మనువడిని కూడా మంత్రిని చేయాలను కుంటున్నరని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం కావాలా? కమిషన్ల పాలన కావాలా? తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశం కు స్వాతంత్ర తెచ్చి,60 ఏళ్ల పాలన లో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ,విద్య,వైద్యం సాగునీరు రంగాలను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసి, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పాఠశాలలలో చదివిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ నాయకులు అడగడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే కల్వకుంట్ల కుటుంబం గుడిమెట్ల దగ్గర అడుక్కొని తినేవారని ఎద్దేవా చేసారు. పాలమూరు జిల్లా దాహార్తిని తీర్చేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథక ప్రాజెక్టును రూపకల్పన చేసి ప్రారంభించే చివరి దశకు చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. 10 శాతం పనులను పూర్తి చేసి మేము చేశామని టిఆర్ఎస్ నాయకులు భుజాలుతడుముకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, విద్యావంతులు, సకల జనుల సమ్మె లో పాల్గొని సాధించుకున్న తెలంగాణ తానే సాధించానని గొప్పలు చెప్పుకుంటున్నాన్నారు.
ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీకి ఇచ్చిన పదేళ్ల పాలనలో కుటుంబం బాగు పడింది గాని ప్రజల బతుకులు బాగుపడలేదని విమర్శించారు. పాలమూరు వలసల జిల్లా నుంచి రాష్ట్ర నాయకత్వ అధ్యక్ష పదవిని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని పాలించే అవకాశం కల్పించాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్