రెవిన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని ఖమ్మం అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లతో రెవిన్యూ సంబంధ విషయాలపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అన్నారు. ధరణి టీఎం-33 మాడ్యూల్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్ర తనిఖీలు పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. జీవో నెం. 58, 59 లపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని, చెల్లింపు మొత్తం వాయిదాల్లో చెల్లించే విధంగా చైతన్య పరచాలన్నారు.
డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తగుచోట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కళ్యాణాలక్ష్మి, షాదిముబారక్ పథక దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయన అన్నారు. మీ సేవా పెండింగ్ మాడ్యూల్స్ కు సంబంధించి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తొలగించాలన్నారు. నేషనల్ హైవే లో రోడ్డు సైడ్ నిర్మాణాలను తనిఖీలు చేసి నివేదిక సమర్పించాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్న లే అవుట్లను గుర్తించి, నివేదిక సమర్పించాలన్నారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ తడితరాలపై నివేదికలు సమయంలోగా సమర్పించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం ఆర్డీఓ రవీంద్రనాథ్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.