కరోనా వ్యాధి పట్టణాలు కాకుండా పల్లెలకు కూడా వేగంగా విస్తరిస్తున్నందున అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూర్యాపేట జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నిరంజన్ ఆదేశించారు. కరోనా వ్యాధి పై మంగళవారం హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి PHC పరిధిలో సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు.
అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని, మాస్కులు ధరించి, చేతులు తరచుగా సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కుంటూ ఉండాలని ఆయన కోరారు. సామాజిక దూరం పాటిస్తూ, కరోనాని అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు.
కంటైమెంట్ ఏరియాలో, పాజిటివ్ వ్యక్తి ఇంట్లో 14 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని పరిసర ప్రాంతాలలో క్రిమిసంహారక చర్యలు చేపట్టాలని సూచించారు. కరోన సోకిన రోగులపై, వారి కుటుంబాలపై వివక్ష చూపవద్దని, తోచిన సహాయం చేయాలని సూచించారు.
వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే అవసరమైన ఆహారం చేపలు, మాంసం, సి విటమిన్ అధికంగా లభ్యమయ్యే నిమ్మ, నారింజ, బత్తాయి, జామ వంటి రసాలను అధికంగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, ప్రమీల, సూపర్ వైజర్ పుల్లమ్మ, హెల్త్ అసిస్టెంట్స్ ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.