ములుగు జిల్లాలో అపరిష్కృతంగా వున్న పెండింగ్ ఖాతాలపై వెంటనే చర్యలు చేపట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య తహశీల్దార్లను ఆదేశించారు.
మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ ఖాతాల విషయంలో ఇక జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎక్కువ ఖాతాల పెండింగ్ వున్న 20 గ్రామాల రెవిన్యూ అధికారులకు ఛార్జ్ మెమోలు జారీచేసి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. తహసిల్దార్లు పెండింగ్ బిల్లులు, యుసి లు వెంటనే సమర్పించాలన్నారు.
పని ఒత్తిడి ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో వినియోగించిన కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాల చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పిడిఎస్ కు సంబంధించి పంపిణీ ప్రతి నెలా 11 లోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
బియ్యం పంపిణీ ప్రతి నెల ఒకటో తారీఖు నుండి చేపట్టేలా చూడాలన్నారు. ఫైళ్లు జిల్లా రెవిన్యూ అధికారి, ఆర్డీవో ల ద్వారా జిల్లా కలెక్టర్ కు సమర్పించాలన్నారు.
తహసీల్దార్లందరూ రికార్డు రూం లో ముగింపు, కరంట్ ఫైళ్ల జాబితా బుక్ లెట్ గా తయారు చేసి, ప్రతి పేజీలో స్టాంప్ తో సంతకం చేసి ఆర్డీవో, కలెక్టరేట్ లకు సమర్పించాలన్నారు.
ఈ జాబితా మేరకు ఫైళ్ల తనిఖీలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి, జిల్లాలోని తహశీల్దార్లు పాల్గొన్నారు.