జగనన్న ఇళ్ల నిర్మాణంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. గృహనిర్మాణం, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై జెడ్పి సమావేశమందిరంలో, రెండు జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల వారీగా, డివిజన్ల వారీగా వ్యక్తిగత ఇళ్లు, కాలనీల ప్రగతిపై సమీక్షించారు. గృహనిర్మాణశాఖ అధికారుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, నవరత్నాలు లో భాగంగా అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ ఇళ్లు మంజూరు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సొంత ఇళ్లు లేని పేదలు ఎవరూ ఉండకూడదన్నది సీఎం జగన్ ఉద్దేశ్యమన్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రతీఒక్కరికీ దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి స్థలం ఇచ్చి, ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
కేవలం ఇళ్లు మంజూరు చేసి వదిలేయకుండా, ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేవరకూ అన్ని దశల్లో వారికి సహకారం అందించి, పేదల సొంతింటి స్వప్నాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆశిస్తున్న లక్ష్యాన్ని సాధించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. బిల్లులు కూడా పెండింగ్లో లేవని, జులై 15 వరకు ఉన్న అన్ని బిల్లులను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.
సిమ్మెంటు, ఇసుక, ఇనుము తదితర నిర్మాణ సామగ్రి అన్నిచోట్లా అందుబాటులో ఉందని చెప్పారు. వ్యక్తిగతంగా మంజూరైన ఇళ్ల నిర్మాణ ప్రగతి బాగుందని, అయితే కాలనీల్లో మాత్రం ఆశించినంత వేగంగా నిర్మాణం జరగడం లేదని అన్నారు. కాలనీలపై దృష్టిపెట్టి ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా, మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్ చేస్తూ ప్రగతిని ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.
జగనన్న కాలనీలకు విద్యుత్ సదుపాయం, ఇళ్లకు కరెంటు కనక్షన్లు మంజూరు చేయడంలో విద్యుత్శాఖ చూపిస్తున్న అలసత్వంపై, ఛైర్మన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంటికి కరెంటు లేకపోతే, లబ్దిదారులు ఎలా గృహప్రవేశం చేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ శాఖాపరంగా జరుగుతున్న జాప్యంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
జగనన్న కాలనీలకు కాకుండా, ప్రయివేటు లేఅవుట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చొరవ చూపిస్తున్న అధికారుల వైఖరిని తప్పుబట్టారు. విద్యుత్శాఖ అధికారులమధ్యే సమన్వయం కరువయ్యిందని అసహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ కనక్షన్లు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ట్రాన్స్కో ఎస్ఇకి సూచించారు.
ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు ప్రకారం, పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, గత ప్రభుత్వ హయాంలో ఒక్కరూపాయి వేసి, వదిలేసిన ఎన్టిఆర్ ఇళ్ల ప్రగతిని పరిశీలించి, వాటిని పూర్తి చేసేందుకు సహకారం అందించాలని కోరారు. గత ప్రభుత్వం లబ్దిదారులకు ఇళ్లు మంజూరు పేరుతో, వారి ఖాతాల్లో కేవలం రూపాయి వేసేసి మోసం చేసిందని విమర్శించారు.
ఈ ఇళ్ల పైనా సమగ్ర సర్వే అప్పటి లబ్దిదారులను కూడా గుర్తించి, వారి ఇళ్లను పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఛైర్మన్ శ్రీనివాసరావు కోరారు. ప్రభుత్వం గృహనిర్మాణ లబ్దిదారులకు అందజేస్తున్న పరికరాలపై గృహనిర్మాణశాఖ ప్రచురించిన బ్రోచర్ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ డాక్టర్ ఎం.అశోక్కుమార్, డిప్యుటీ సిఇఓ కె.రాజ్కుమార్, విజయనగరం, పార్వతీపురం జిల్లాల గృహనిర్మాణ శాఖాధికారులు ఎస్వి రమణమూర్తి, పి.రఘురామ్, ట్రాన్స్కో ఎస్ఇ పి.నాగేశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ కెవి శివానందకుమార్, వివిధ శాఖల ఇఇలు, డిఇలు, ఎఇలు పాల్గొన్నారు.