ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా మజ్దూర్ యూనియన్ సహాయ కార్యదర్శి, కొల్లాపూర్ ఆర్టీసీ జేఏసీ నాయకుడు రామయ్య డిమాండ్ చేశారు. ఇప్పటికి 28 మంది కార్మికులను పొట్టనపెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమను విధుల్లోకి తీసుకోకుండా తాత్సారం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇంకెంత మంది ఆర్టీసీ కార్మికులు చనిపోతే కేసీఆర్ కు తృప్తిగా ఉంటుందో చెప్పాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టారని, ఆర్టీసీని ఎలాగైనా ప్రయివేటు వారికి కట్టబెట్టాలనే కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేస్తామని ఆర్టీసీని కాపాడుకుంటామని రామయ్య అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఈ విధంగా తయారవుతుందని తాము ఊహించలేదని ఆయన అన్నారు. హక్కుల సాధన కోసం సమ్మె చేస్తే దాన్ని అత్యంత దుర్మార్గంగా అణచివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత దారుణాన్ని చూడలేదని, తక్షణమే ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని రామయ్య డిమాండ్ చేశారు.
previous post