కరోనా మూడవ దశ నుండి కాపాడుకునేలా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు. గురువారం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి, ఆసుపత్రిలోని పలు విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో 1 లక్ష 34 వేల గృహాలకు వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటి సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దగ్గు, జ్వరం, జలుబు ఉన్న వారిని గుర్తించి వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్లు అందజేయాలని, మూడవ దశ కోవిడ్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె సూచించారు. మాస్కులు దరించటం, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఎవరు బయటకు రాకూడదని ఆమె అన్నారు. జిల్లాలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, స్థానిక అధికారులు సహకరించి కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వైద్య సహాయం అందించేందుకు ఆసుపత్రిలో వంద పడకల ఆక్సీజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. చిన్న పిల్లలకు కరోనా ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, డీఎంహెచ్వో చందు నాయక్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యంన్యూస్.నెట్