కరొనా వైరస్ నేపథ్యంలో ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా విధులను నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది ని ప్రభుత్వాలు విధులను మెచ్చుకొని పూలవర్షం కురిపించే బదులు పూటగడవడమే కష్టతరంగా మారిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆదుకోవాలని జుక్కల్ నియోజకవర్గ సి ఐ టి యు కన్వీనర్ సురేష్ గొండ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సి ఐ టి ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం బిచ్కుంద ఎంపిడిఓ కార్యాలయం ముందు తమ సమస్యల పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సురేష్ గొండ మాట్లాడుతు దేశంలో కరొనా సాకుతో పారిశ్రామిక వేత్తలు తమ లాభాలను కాపాడుకునేందుకు కార్మిక చట్టాల అమలును తుంగలో తొక్కుతున్నారన్నారు.
కరొనా మహమ్మారి నేపథ్యంలో కూడ మోడి ప్రభుత్వం అబద్దపు ప్రచారాలకు దిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి తమ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులకు ఆదుకోవాలన్న స్పృహ తెరాస ప్రభుత్వానికి లేదని మండి పడ్డారు.
రాష్ట్రంలో అంగన్వాడీ, ఆశలకు పనిభారం పెంచి ఉద్యోగ భద్రతకు ముప్పు తెచ్చి జి ఓ లను తీసుకొచ్చారని, పాఠశాల లోని మధ్యాహ్న భోజన కార్మికులకు వేయి రూపాయలు ఇచ్చి చాకిరి చేయించుకుంటున్నారని, హమాలీలకు సమగ్ర చట్టం లేదు, బీడి, భవన నిర్మాణ రంగాల్లో, ఆటో తదితర అసంఘటిత కార్మికులకు ఏమాత్రం పని భద్రత లేదని గుర్తు చేశారు.
పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, ప్రతి ఒక్కరికి యూనిఫామ్ లను అందించాలని, కరొన వైరస్ నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీ కి సంభందించిన కార్మికులందరికీ 15వేల చొప్పున ప్రోత్సహకాని ఇవ్వాలని, ఆశలకు 18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రతి ఒక్కరికి భీమా సౌకర్యం కల్పించాలని, కరొనా సమయంలో శానిటైజర్ సరఫరా చేయాలని పేర్కొన్నారు. చలి చాలని వేతనాలతో విధులను నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో కోతలు విధించడం సరైంది కాదన్నారు. ప్రస్తుతం 8గంటల పనిదినం జి ఓ ను 12గంటలకు చేస్తూ కొత్త జి ఓ అమలును తక్షణమే విరమించుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
అనంతరం ఎంపిఒ మహిబుబ్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో గ్రామ పంచాయతీ కార్మిక సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు వీరయ్య, సాయిలు, సాయి కుమార్, పీరయ్య, గంగారాం, బలరాం, ప్రేమల, హన్మవ్వ తదితరులు పాల్గొన్నారు.