ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై దేశవ్యాప్తంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నవారికి అరుదైన గౌరవం దక్కింది. కరోనా వైరస్ తో యుద్ధం చేస్తున్న వారియర్స్ పై ఆకాశం నుంచి పూల వర్షం కురిపించింది భారత వాయుసేన. ఆ ఖ్యాతి దేశంలోని కొన్ని ప్రదేశాలతో బాటు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణానికి దక్కింది.
నేటి ఉదయం 9.30 గంటలకు గాంధీ ఆస్పత్రిలో హెలికాప్టర్ ద్వారా వాయు సేన పూలవర్షం కురిపించింది. దీనికి సంబంధించి శనివారమే ఆస్పత్రి పరిసరాల్లో ట్రయల్ రన్ జరిగింది. కరోనా యోధులు చేస్తున్న కృషికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ పూలవర్షం కురిపించాలని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. ప్రత్యేక శిక్షణ పొందిన వాయుసేన దళాలు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాయి. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని జయశంకర్ విగ్రహం వద్ద వాయుసేన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించిగా ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్నర్సులు, పారిశుధ్యం, పారామెడికల్, పోలీస్, నాల్గవ తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.