కరోనా వైరస్ కు సంబంధించి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో చైర్మన్ కె రామ్మోహన్ రావు అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డిప్యూటీ చైర్మన్ హరనాథ్, పోర్టు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం మార్చ్ 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పోర్టులో అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా పలు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. పోర్టులో అత్యవసర విభాగాలు మినహా మిగిలిన సిబ్బంది అంతా సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే పని చేయవచ్చని నిర్ణయించారు. విశాఖ పోర్టులో యాంత్రీకరణ విధానంలో జరిగే కార్గో హ్యాండ్లింగ్ మాత్రం యధావిధిగా కొనసాగుతుంది అని, మ్యాన్యువల్ విధానం లో 31వ తేదీ వరకు ఆంక్షలు విధించారు.
సాధ్య మైనంతవరకు వ్యక్తులు ఒకచోట చేరకుండా ఉండేలా నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. . పోర్టు కార్య నిర్వహణ కొరకు తప్పనిసరి అయినటువంటి టగ్గులు, లాంచులు మొదలైన వాటి సిబ్బంది విధులకు సంబంధించి నియంత్రణ విధించారు.
ఈ విభాగాలలో ప్రస్తుతం మూడు షిఫ్ట్ లలో(8గంటల చొప్పున) కార్మికులు పని చేస్తున్నారు. నియంత్రణలో భాగంగా ప్రస్తుతం వీటిని రెండు షిఫ్ట్ లకు పరిమితం చేశారు. అనగా షిఫ్ట్ కి అవసరమైన కనీస సిబ్బంది 12 గంటలపాటు పని చేస్తారు.
ఇక మినిస్టీరియల్ స్టాఫ్ మొత్తం కూడా సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచి పనిచేయాలని నిర్ణయించారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్, జి.ఎ.డి విభాగాలకు కూడా ఇది వర్తిస్తుంది. చీఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో విద్యుత్ సరఫరా, నిర్వహణ వంటి అత్యవసర సేవల లో పనిచేసే వారు మినహా మిగిలిన వారంతా సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వహించుకునే వీలు కల్పించారు.
ఆదే విధంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో మంచినీటి సరఫరా, నిర్వహణ వంటి అత్యవసర సేవలు అందించే సిబ్బంది మినహా, మిగిలిన వారంతా ఇంటి నుంచే పని చేసుకోవాలని సూచించారు. విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ కు సంబంధించి ఆరోగ్య విభాగం అంతా పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తారు.
డెప్యూటీ కన్జర్వేటర్ విభాగానికి సంబంధించి పైలెట్లు, సపోర్టింగ్ స్టాఫ్ విధులలో ఉంటారు ఇక పోర్టు సెక్యూరిటీ సిబ్బంది అంతా ఎప్పటిలాగానే తమ విధుల్లో ఉంటారు. పోర్టులో సిబ్బందికి ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ, వారందరూ పూర్తిస్థాయిలో ఫోన్ లో అందుబాటులో ఉండాలని అధికారులు సూచించారు.
అత్యవసరమైతే వారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరుగా విధులకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఈ ఆదేశాలన్ని మార్చి 31 వరకు అమలులో ఉంటాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.