అద్భుతమైన నేత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరని సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ నేశారు. ఈరోజు హైదరాబాద్ లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో తను నేసిన చీరను ప్రదర్శించారు.
విజయ్ నేసిన అద్భుతమైన చీరకు మంత్రులు ప్రశంసలు కురిపించారు. ఈ చీరకు సంబంధించిన నేత ప్రక్రియను, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నామని… ఇంత అద్భుతమైన చీర వేసిన విజయ్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు.
తాను నేసిన ఈ చీరని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి విజయ్ అందించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో సిరిసిల్లలోని నేత రంగంలో ఇప్పటికే అనేక మార్పులు వచ్చాయని, సిరిసిల్ల నేతన్నలు ఆధునికమైన మరమగ్గాల వైపు, ఆధునిక పద్ధతుల వైపు వెళ్తున్నారని విజయ్ మంత్రులకు తెలిపారు.
ప్రస్తుతం తాను వేసిన చీర సైతం మూడు రోజులు మరమగ్గాల పై నేసే అవకాశం ఉంటుందని… అదే చీర చేతితో వేయాలంటే రెండు వారాల సమయం పడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. నేత కార్మికుడి ప్రయత్నాన్ని అభినందించిన మంత్రులు ఆయన చేసే భవిష్యత్తు ప్రయత్నాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ మేరకు త్వరలోనే తాను ప్రారంభించబోయే యూనిట్ ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి కేటీఆర్ ను విజయ్ ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి రావడంతో పాటు విజయ్ ప్రయత్నాలకు అన్నిరకాలుగా సహకారం అందిస్తానని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.