(సత్యం న్యూస్ ప్రత్యేకం)
రిపబ్లిక్ డే…గణతంత్ర దినోత్సవం! మరోసారి వచ్చింది. ఢిల్లీ లోని జనపథ్ మార్గంలో రిపబ్లిక్ డే విన్యాసాలు జరగనున్నాయి. ప్రత్యేక అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారొ తమ దేశ ప్రతినిధి బృందంతో హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ దెశాల సదస్సులో బ్రెజిల్ అధ్యక్షుడితో సమావేశమైన సందర్భంగా మోడి భారత్ రిపబ్లిక్ ఉత్సవాలకు ఆహ్వానించారు.
బ్రెజిల్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగు పరచుకునేందుకు ఆ దేశాధ్యక్షుడి పర్యటన దోహదపడగలదని భారత్ భావిస్తోంది. 70వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా కన్నుల పండుగగా జరగనున్న కవాతుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజ్ పథ్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ సైనిక వందనం స్వీకరిస్తారు. అసలింతకూ ఈ వేడుకలకు ఎందుకింత ప్రాశస్త్యం?ఎందుకు ఇంత ప్రాధాన్యత? భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.
1950 జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం పొందగా సుమారు మరో రెండేళ్ళ తర్వాత స్వతంత్ర రిపబ్లిక్ గా అవతరించేందుకు వీలుగా ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థ ను అమలులోకి తేవాలని ఆనాటి పాలకులు నిర్ణయించారు. ఆనాడు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎన్నికయిన రాజకీయవేత్తలు, మేధావులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి అభిప్రాయాలను సూచనలు సలహాలు స్వీకరించి దీర్ఘకాలిక చర్చల అనంతరం సముచిత నిర్ణయం తీసుకున్నారు.
వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాల ప్రదర్శనతో పాటు త్రివిధ దళాల కవాతు నిర్వహిస్తారు. సైనిక వాయు నౌకా దళాలకు చెందిన మహిళా దళాలు కూడా రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొనడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారింది. సరిహద్దు భద్రత తో పాటు తీరప్రాంత రక్షణకు సంబంధించిన శకటాలను కూడా ప్రదర్శించి సైనిక వాయు నౌకా దళాల శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా గణతంత్ర దినోత్సవ ప్రదర్శన రూపాంతరం చెందినట్లయింది.
స్వేచ్ఛ సమానత్వం సమ న్యాయం సౌభ్రాతృత్వం నినాదంగా భవిష్యత్తులో కూడా ముందుకు సాగాలన్నదే భారత రిపబ్లిక్ నిశ్చితాభిప్రాయంగా ఉంది. రిపబ్లిక్ డే నాడు దేశ రాజధాని ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి సంబరాలకు సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి.
-వ్యాకరణం రామ సుబ్రహ్మణ్యం