అంతరించిపోతున్న జంతుజాల రక్షణలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్, హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి 15 పులులను దత్తత తీసుకుంది. ఈ పులుల సంరక్షణ కోసం తెలంగాణ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ శోభకు SBI, హైదరాబాద్ సర్కిల్, చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ పదిహేను లక్షల రూపాయల విరాళం అందచేశారు.
హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని టైగర్ ఎన్ క్లోజర్ వద్ద సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ M J అక్బర్, నెహ్రూ జూలాజికల్ పార్క్ రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. పర్యావరణ శ్రేయస్సు కోసం ఉద్దేశించిన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ ముందంజలో ఉందని ఈ సందర్భంగా జింగ్రాన్ చెప్పారు. దశాబ్దానికి పైగా SBI పర్యావరణ పరిరక్షణకు మద్దతు ఇస్తోందని ఆయన తెలిపారు.
దేశంలోని అతిపెద్ద జంతుప్రదర్శనశాలలలో ఒకటి అయిన నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్లో చూడదగిన ప్రదేశాలలో ఒకటి అని ఆయన అన్నారు. భారతీయ ఖడ్గమృగం, ఆసియాటిక్ సింహం, బెంగాల్ టైగర్, పాంథర్, గౌర్, ఇండియన్ ఏనుగు, సన్నని లోరిస్, జింకలు మరెన్నో అరుదైన జంతుజాలం, పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు ఇక్కడ ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇక్కడ ఉన్న భారీ ఓపెన్ ఎన్క్లోజర్లు జంతువులకు సహజ ఆవాసాన్ని అందిస్తాయి. జూలో సఫారీ పార్క్ (సింహం, టైగర్, బేర్ & బైసన్), నాక్టర్నల్ యానిమల్ హౌస్, బటర్ఫ్లై పార్క్, పారెట్ వరల్డ్, రెప్టైల్ హౌస్ ఫాసిల్స్ మ్యూజియం & నేచురల్ హిస్టార్టీ మ్యూజియం వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. దేశంలో ISO సర్టిఫికేట్ పొందిన మొదటి జూ పార్క్ ఇది అని ఆయన తెలిపారు. ఆసియాటిక్ సింహం (పాంథర్ లియో) కోసం కొత్తగా పునర్నిర్మించిన ఎన్క్లోజర్ను జింగ్రాన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ SBI వరుసగా 10వ సంవత్సరం పులులను దత్తత తీసుకోవడంలో ఆసక్తి కనబరుస్తున్నందుకు, జూలో వన్యప్రాణుల సంరక్షణ & అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు.