కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై తెదేపా నేత వర్ల రామయ్య డీజీపీకి పిర్యాదు చేశారు. దళిత యువకుడు పైడి హర్ష ఆత్మహత్యకు ప్రతాప్ కుమార్ రెడ్డి వేధింపులే కారణమని లేఖలో పేర్కొన్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి వేధింపులతో ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు బాధలు పడుతున్నారని ఆయన అన్నారు.
నెల్లూరు దళితులు నారాయణ, కరుణాకర్, అనుష్కల మరణాలు మరువక ముందే ఇంకో దళితుడి ఆత్మహత్య ప్రయత్నం కలచివేస్తోంది. పోలీసుల సహకారంతో వైసీపీ నాయకులు దళితులపై రెచ్చిపోయి వేధింపులకు పాల్పడుతున్నారు అని ఆయన లేఖలో పేర్కొన్నారు. హర్షను వైసీపీ లో చేరాలంటూ ప్రతాప్ కుమార్ రెడ్డి వేధించాడు.
వైసీపీలో చేరేందుకు నిరాకరించడంతో పోలీసులతో కలిసి ఎమ్మెల్యే హర్షపై తప్పుడు కేసులు బనాయించాడు. పార్టీలో చేరకుంటే పోలీసులతో ఎన్ కౌంటర్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో బయపడిన హర్ష పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని వర్ల తన లేఖలో వివరించారు. దళిత యువకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయండి. ఎమ్మెల్యేతో కుమ్మక్కై హర్షపై తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై విచారణ చేసి చర్యలు తీసుకోండి.
తమరు తీసుకుని సత్వర చర్యలు బాధితులకు భరోసా కల్గించి ప్రజలలో పోలీసులపై నమ్మకం ఏర్పడుతుంది. నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నాను అని ఆయన అన్నారు.