విజయనగరంలో పలు ప్రాంతాలను జిల్లా ఎస్పీ రాజకుమారి సందర్శించి, కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించేందుకుగాను జిల్లా ఎస్పీ రాజకుమారి జిల్లా పోలీసు కార్యాలయం నుండి ఆర్టీసి కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షను, రింగు రోడ్డు, ఫోర్ట్ సిటీ, దాసన్నపేట రైతు బజారు, కొత్తపేట నీళ్ళ ట్యాంకు, మూడు లాంతర్లు, గంట స్థంభం, కే.పీ టెంపుల్, రైల్వే స్టేషను ప్రాంతాలను సందర్శించి, వివిధ ప్రాంతాల వద్ద పోలీసు బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడి,వారికి పలు సూచనలు చేసారు.
బయటకు వచ్చి తిరిగే యువతకు కౌన్సిలింగు చేయాలని, అత్యవసర వైద్య సేవల నిమిత్తం బయటకు వచ్చిన వ్యక్తులకు మినహాయింపుని ఇవ్వాలన్నారు. బయటకు వచ్చిన వ్యక్తులు చెప్పే కారణాలు సహేతుకరంగా లేనపుడు వారిపై కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా కేసులు నమోదు చేయాలన్నారు.
ఉదయం 6 గంటల నుండి 12గంటల వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతర బజారు పనులు చేసుకొనేందుకు ప్రభుత్వం వెసులు బాటు కల్పించిన సమయంలో ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ప్రతీ ఒక్కరూ కొనుగోలు చేసే షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చూడాలన్నారు. నోరు, ముక్కు పూర్తి మూసివేసే విధంగా మాస్క్ ధరించాలని, చేతులను తరుచూ శుభ్రం చేసుకొనే విధంగా చూడాలన్నారు.
కోవిడ్ని బంధనలు పాటించన షాపు యజమానుల పైన కూడా కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం ఈ నెల చివర వరకు పొడిగించినందున ప్రజలెవ్వరూ అత్యవసర అవసరాల నిమిత్తం మాత్రమే బయటకు రావాలన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన 237 మందిపై 143 కేసులు నమోదు చేసామన్నారు.
కర్ఫ్యూ సమయంలో బయటకు తిరిగే వాహనదారులపై 1621 ఎం.వి. కేసులు నమోదు చేసి, 7 లక్షల 20, వేల 670 రూపాయల జరీమానగా విధించి, 15 వాహనాలును స్వాధీనం చేసుకున్నామన్నారు. మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారిపై లక్షా,24,419 కేసులు నమోదు చేసి 99 లక్షల ,83,695 రూపాయల జరీమానాలుగా విధించామని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.
జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, విజయనగరం వన్ టౌన్ సీఐ జె.మురళి, టూటౌన్ సీఐ సిహెచ్. శ్రీనివాసరావు, రూరల్ సీఐ మంగవేణి, రూరల్ ఎస్ఐ నారాయణరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.