అభివృద్ధి చెందిన కొన్ని దేశాల సహకారంతో గగనతలంలో భారత్ చేస్తున్న సైనిక విన్యాసాలు పాకిస్తాన్ కు భద్రతాపరమైన సవాళ్లు విసురుతున్నాయని పాకిస్తాన్ కు చెందిన యుద్ధ నిపుణులు అభిప్రాయపడ్డారు.
1998 లో జరిగిన అణు పరీక్షలకు 23 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇస్లామాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో పలువురు వక్తలు భారత్ గగనతలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఉపయోగించడంలో అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు.
ఈ సమావేశంలో స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ రాయబారి జమీర్ అక్రమ్, ఆయుధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ కమ్రన్ అక్తర్ లు పాల్గొన్నారు.
భారత్ అనుసరిస్తున్న విధానాలు ఆసియా ఉపఖండంలో అస్థిరతను పెంచుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
సైబర్ వార్ ఫెయిర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబోటిక్స్, ఆటోమేటిక్ యుద్ధ పరికరాలను తయారు చేసుకోవడంలో భారత్ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నదని వారు అన్నారు.
భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి పాకిస్తాన్ కూడా రక్షణ రంగంలో భారీ ఎత్తున ఖర్చులు పెంచుకోవాల్సి వస్తున్నదని వారు తెలిపారు.