తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాల్సిందేనని, రద్దు చేసే అంతవరకు పోరాటాన్ని ఆపబోమని తెలంగాణ రాష్ట్ర రెండో ఏఎన్ఎంల సంఘం (ఏఐటీయూసీ )రాష్ట్ర అధ్యక్షురాలు బడేటి వనజ స్పష్టం చేశారు. 8వ రోజు సమ్మె సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండవ ఏఎన్ఎం లు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరిగిన నిరసన లో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సిహెచ్ విజయ్ కుమారితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ అసలు రెండో ఏఎన్ఎం అనే పదంలోనే వివక్షత ఉందన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా భావిస్తున్నారు అని అనటానికి ఈ పదమే నిదర్శనం అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేసిన సిబ్బందిని గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందన్నారు. ఒకే పని ఒకే విద్యార్హత ఉండి జీతంలో భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉండటం ఆలోచించదగ్గ విషయం అన్నారు.
గ్రామపంచాయతీ పరిధిలో రోగులతో అత్యంత ప్రేమగా ఉంటూ సేవచేసే ఈ ఏఎన్ఎం లను ప్రభుత్వం మంచిగా చూసుకుంటే వారు ప్రభుత్వం గురించి మంచిగా ప్రచారం చేస్తారని దీనిని ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలన్నారు. కానీ సేవ చేసే వారిని హింసించటం సరికాదన్నారు. ఉద్యోగంలో చేరి 20, 25 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటం బాధాకరమన్నారు.
కనుక ప్రభుత్వాలు కాంట్రాక్ట్& ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఆలోచన చేసి 15 సంవత్సరాల సేవకుగాను వెంటనే నోటిఫికేషన్ రద్దుచేసి రెండవ ఏఎన్ఎం లను క్రమబద్ధీకరించాలని ఆమె ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెండవ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తమ్మరపు జయమ్మ, శీలం నాగ శేషమ్మ, లలిత కుమారి.అరుణ, నాగమణి, శైలజ, రజిని తదితరులు పాల్గొన్నారు.