ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు 130 కిలో మీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రాన్ని రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రష్యన్ ఆర్మీ దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉన్నామని, అయితే ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు తమను ఒంటిరిని చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రెండో రోజు ఉక్రెయిన్ లోని 13 నగరాల్లో రష్యన్ బలగాలు తీవ్రమైన దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే పలు సిటీల్లో ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సైనిక స్థావరాలు, డిఫెన్స్ వెపన్ స్టోరేజ్ సెంటర్ పై మిస్సైల్స్, బాంబు దాడులతో ధ్వంసం చేసింది. గురువారం ఉదయం దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో సైనికులు, సామాన్య ప్రజలు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
ఉక్రెయిన్కు నాటో సభ్యత్వంపై హామీ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం సెంట్రల్ కీవ్లో రెండు భారీ పేలుళ్ళు వినిపించాయి. రష్యన్ సేనలు కీవ్ను సమీపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ సైన్యం ఫేస్బుక్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం, కీవ్లో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యా దాడులు చేస్తోంది.
దాంతో అధ్యక్షుడు బంకర్ లోకి వెళ్లిపోయారు. కీవ్లో దాదాపు 3 మిలియన్ల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భయానకంగా బాంబు దాడులు జరుగుతూ ఉంటే, ఈ హైవేపై కార్లలో వేలాది మంది చిక్కుకుపోయారు.
ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 1 లక్ష మంది ఉక్రెయినియన్లు తమ ఇళ్ళను వదిలిపెట్టి పారిపోయారు. వేలాది మంది పొరుగున ఉన్న రుమేనియా, మాల్డోవా, పోలండ్, హంగేరీ దేశాలకు వెళ్లిపోతున్నారు.