ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ వనపర్తిలో మంత్రి తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీ చేయలేదని, మంత్రి పిఆర్ఓ ఇంకా విధుల్లో కొనసాగుతున్నాడని బీసీ పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చెప్పారు. ఎన్నికల నియమావళి మంత్రి సిబ్బందికి వర్తించదా అనీ సందర్భంగా ప్రశ్నించారు.
ఎన్నికల అధికారులు స్పందించి మంత్రి పిఆర్వోను బదిలీ చేయాలని కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయించి, మంత్రి పిఆర్ఓను బదిలీ చేయాలని కోరారు. వనపర్తి జిల్లాలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని, వారి వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సంగతి గుర్తుంచు కోవాలన్నారు. ఇంటి స్థలం విషయంలో కూడా పక్షపాతం చూపడం సమంజసం కాదన్నారు.
వనపర్తిలో విలేకరులకు ప్రభుత్వ స్థలాన్ని పంపిణీ చేసిన మంత్రి ఆ స్థలానికి తన తల్లి పేరు పెట్టుకోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వనపర్తిలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యేలు జయరాములు, డాక్టర్ బాలకిష్టయ్య, అయ్యప్ప లాంటి ఎంతోమంది ఉన్న కూడా వారిని విస్మరించడం తగదన్నారు.
వనపర్తిలో విలేకరుల కాలనీకి తక్షణమే మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు అంజన్న యాదవ్, శేఖర్ గౌడ్, మహేందర్ నాయుడు, శివ యాదవ్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్