కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణలో ముగ్గురు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ బదిలీ కావడం గమనార్హం.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా దీర్ఘ కాలంగా అంటే మూడేళ్లకు పైగా కొనసాగుతున్న వెంకటరామిరెడ్డిని తొలగించాలని కాంగ్రెస్, బిజెపిలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
దాంతో ఆయనను అక్కడ నుంచి బదిలీ చేశారు. తెలంగాణ ఎన్నికల అధికారి సిఫార్సు మేరకు మరి కొందరిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా భారతీ హోలికెరిని నియమించారు.
ప్రస్తుతం ఆమె మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు. సిద్దిపేట నుంచి బదిలీ అయిన వెంకటరామిరెడ్డిని సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నహన్మంతరావును ప్రస్తుతం ఖాళీగా ఉన్న మెదక్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక కు పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.