కాకినాడలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆర్థిక లావాదేవీలకు వినియోగించే స్టాంపు పేపర్లకు కొరత ఏర్పడింది. ఆర్థిక లావాదేవీలకు అవసరమైన స్టాంపు పేపర్ల నిమిత్తం వినియోగదారులు కార్యాలయానికి వెళితే లేవని 50, వంద రూపాయలు స్టాంపు పేపర్లు రావడం లేదని సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. 10, 20 రూపాయల స్టాంపులను తీసుకోవాలంటూ వారు సలహాలు ఇస్తున్నారు.
అలాగే అక్కడే తిష్ట వేసిన ప్రైవేట్ లేఖరులు స్టాంపు పేపర్లపై 20 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేయడమే కాకుండా వారివద్ద పుష్కలంగా అవసరమైన స్టాంప్ పేపర్లు లభిస్తున్నాయి.
జిల్లా రిజిస్టర్ కార్యాలయంలోనే ఈ-పేపర్ల పేరిట ఒక ప్రత్యేక ప్రైవేట్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా 100 రూపాయల స్టాంప్ పేపర్కు అదనంగా 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ- స్టాంప్ పేపర్ కౌంటర్లో కూడా అధికంగా వసూలు చేయడం పట్ల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారులకు అందించకుండా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ అక్రమార్కులకు ప్రోత్సహించేందుకు స్టాంప్ పేపర్లను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైగా జిల్లా రిజిస్టర్ కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ- కౌంటర్లోనే మరో 20 నుంచి 30 రూపాయలు వరకు అదనంగా వసూలు చేయడం ఏమిటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అవసరమైన స్టాంపు పేపర్లను అందివ్వాలని అక్కడ అక్రమార్కులకు, బ్లాక్ మార్కెటర్లకు అడ్డుకట్ట వేయాలని వినియోగదారులు కోరుతున్నారు.