విశాఖపట్నం ఎయిర్ పోర్టులో చంద్రబాబు ను ఎవరూ అరెస్ట్ చేయలేదని హోంమంత్రి సుచరిత అన్నారు. రాజకీయం చేసేందుకే విశాఖలో ఆయన పర్యటన పెట్టుకున్నారని హోం మంత్రి అన్నారు. చంద్రబాబు పర్యటనను ప్రజలే అడ్డుకున్నారని ఆమె అన్నారు. శాంతి భద్రతల కారణంగానే బాబును వెనక్కి పంపాల్సి వచ్చిందని హోం మంత్రి అన్నారు.
అప్పట్లో బాబు మెచ్చుకున్న పోలీసులే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారని ఆమె అన్నారు. కడప జిల్లా లోని కేంద్ర కారాగార సందర్శన అనంతరం హోం మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితర ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసుల సేవా కార్యక్రమాల పోస్టర్ ను హోం మంత్రి సుచరిత విడుదల చేసారు .ఖైదీలంతా ఉపాధి పొందే విధంగా కారాగారాల్లో నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. క్షణికావేశంలో ఉన్న వారిలో మానసిక పరివర్తన పొందే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు.
మహిళా భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా దిశా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేశామన్నారు. దిశా చట్టంలో భాగంగా విశాఖలో పోరెనిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఖైదీలను సోదరా భావంతో చూడాలని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల కు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.