ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఆరుగురు మరణించారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోరస్ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలోని యూనిట్ 4లో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలోనే ఐదుగురు సజీవ దహనం కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.
మృతుల్లో నలుగురు బిహార్ వాసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పని చేస్తున్నట్లు సమాచారం. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది.
చక్కెర కర్మాగారాన్ని రసాయన పరిశ్రమగా మార్చారు. ప్రమాదం జరిగాక కంపెనీ వాళ్లు చర్యలు తీసుకోలేదు. ప్రమాదాలకు నిలయంగా మారుతున్న కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయ్యాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. కెమికల్ ఫ్యాక్టరీ కాలుష్య కోరలలో గ్రామం అనారోగ్యంకు గురవుతున్నామనీ గ్రామస్తులు ఆగ్రహాo వ్యక్తం చేశారు.