బాలివుడ్ నటి సోనమ్ కపూర్ ఢిల్లీ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 2.4 కోట్ల విలువైన నగదు, నగలు దొంగిలించినట్లు గుర్తించారు. దాంతో ఇంట్లో పని చేస్తున్న ఒక నర్సు, ఆమె భర్త ను పోలీసులు అరెస్టు చేశారు. సోనమ్ కపూర్ అత్తగారు అక్కడ నివసిస్తుంటారు.
ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు, సహాయం చేసేందుకు అపర్ణా రూత్ విల్సన్ అనే ఒక నర్సును అప్పాయింట్ చేశారు. అపర్ణ అక్కడే నివాసం ఉండేది. ఆమెతో బాటు ఆమె భర్త నరేష్ కుమార్ సాగర్ కూడా ఉండేవాడు. సాగర్ షకర్పూర్లోని ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్ గా పని చేసేవాడు.
ఫిబ్రవరి 11న దొంగతనం జరిగిందని సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజాలు ఫిర్యాదు చేయగా, ఫిబ్రవరి 23న తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, న్యూ ఢిల్లీ జిల్లా స్పెషల్ స్టాఫ్ బ్రాంచ్ బృందం కేసు దర్యాప్తు చేసింది.
ఆ ఇంటిలో మొత్తం 20 మంది పని చేస్తుంటారు. కేసు పరిశోధించిన పోలీసులు ఇంటి దొంగ నర్సు, ఆమె భర్తేనని గుర్తించారు. దాంతో మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్టు పోలీసులు బుధవారం తెలిపారు. చోరీకి గురైన నగలు, నగదు ఇంకా రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు.