ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎక్కడ జరగనిరీతిలో అష్టాదశ శక్తిపీఠాలు మహా శోభా యాత్ర నెల్లూరులో అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం నెల్లూరు నగరం నడిబొడ్డున టీటీడీ కల్యాణమండపం నుండి రాజరాజేశ్వరి దేవస్థానం వరకు నిర్వహించిన అష్టాదశ శక్తిపీఠాలు శోభాయాత్ర నెల్లూరు జిల్లాలోనే చారిత్రాత్మకంగా నిలిచింది. అమ్మవారి ప్రతిమ ఒక పల్లకిలో, చీరసారెలు మరో పల్లకిలో, ఆదిశంకరాచార్యుల ప్రతీమ మరో పల్లకిలో ఊరేగింపు మొదలవ్వగా గంగాజలం, పసుపు, కర్పూరాలతో రోడ్డును శుద్ధి చేసి, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటాలు, కళాకారుల నృత్యాలు, అశ్వాలతో స్వగతం పలికిన ఈ మహా శోభాయాత్ర ఘట్టం పవిత్ర దసరా మహోత్సవాలకు నాందిపలికాయి.
ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన అష్టాదశ శక్తిపీఠాలనుంచి అమ్మవార్లకు అలంకరించిన చీర, అభిషేకించిన జలం, అమ్మవారికి పెట్టిన కుంకుమ, కాళ్లవద్ద ఉంచిన నెయ్యి లను సేకరించి, మహా శోభాయాత్రలో ఊరేగింపుగా తీసుకురావడం అద్భుత ఘట్టం. నెల్లూరు ప్రజలు కనీవినీఎరుగని రీతిలో నాభూతో నా భవిష్యత్ అన్నట్లు ఈ అష్టాదశ శక్తిపీఠాలు శోభాయాత్రకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు, రుత్వికులు, సన్నిహితులు, స్నేహితులు, రూరల్ నియోజకకవర్గ ప్రజలకు, మహిళలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి, ప్రముఖ అమ్మవారి ఉపాసకులు కోట సునీల్ శర్మ, నగర మేయర్ పొట్లూరి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.