లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని కోరుతున్నా రోడ్లపైకి ప్రజలు వస్తున్న క్రమంలో వారిని చైతన్యం చేయడం లక్ష్యంగా రూపొందించిన ఉండలేవా పాటను నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ ఆవిష్కరించారు. చండూర్ సిఐ సురేష్ కుమార్ అద్భుతగానంతో రూపొందించిన పాటను శుక్రవారం సాయంత్రం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ల్యాప్ టాప్ ద్వారా ఆయన ఆవిష్కరించి సిఐ సురేష్ ను అభినందించారు.
సమాజాన్ని చైతన్యం చేయడం లక్ష్యంగా లాక్ డౌన్ లో విధి నిర్వహణ చేస్తూ భార్య, పిల్లలకు దూరమై ప్రజల ప్రాణాల రక్షణ కోసం పని చేస్తున్న పోలీసన్న భావోద్వేగంతో రూపొందించిన ఈ పాట చాలా అద్భుతంగా ఉన్నదని అభినందించారు. పాటను రూపొందించిన జిల్లాకు చెందిన సినీ కళాకారుడు చరణ్ అర్జున్ బాధ్యతాయుతంగా ఇలాంటి పాటలు, లఘు చిత్రాలను రూపొందించడం జిల్లాకే గర్వకారణమని ఎస్పీ చెప్పారు.
ఇంట్లో ఉండలేవా పేరుతో రూపొందిన ఈ పాటను జిఎంసి టెలివిజన్ ప్రసారం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు చెందిన సిఐ సురేష్ చక్కని గానం ఎంతగానో అలరించిందని, పోలీస్ శాఖలో కళాకారులను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై విధి నిర్వహణ చేస్తూ కుటుంబాలకు సైతం దూరమవుతున్న పోలీసుల భావోద్వేగాలను అద్భుతంగా పాడిన పాట ఆలోచింపజేసే విధంగా ఉన్నదని ఎస్పీ రంగనాధ్ అభినందించారు. కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, మెట్టు సతీష్ కుమార్, మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.