కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆంక్షలు తీవ్రతరం చేశారు. దాదాపుగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయాలని నేడు సబ్ కలెక్టర్ నేతృత్వంలో జరిగిన సమావేశం నిర్ణయించింది.
ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటలకు వరకు మాత్రమే అన్ని వ్యాపార సంస్థలు పనిచేస్తాయి.
ప్రజలు అందరూ మాస్క్ ధరించాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక దూరం పాటించాలని, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అందరూ చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు.
తొలి సారి కరోనా వచ్చినప్పుడు నరసరావుపేటలో కరోనా కేసులు తీవ్రంగా నమోదు అయిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ లో ఈ విధమైన పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామని అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నందున నరసరావుపేట ప్రభుత్వం ఆసుపత్రిలో దాదాపుగా అన్ని బెడ్స్ నిండిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు.
పోలీసులకు, అధికారులకు ప్రజలు సహకరిస్తే కరోనాను అదుపులోకి తీసుకురావచ్చునని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రంజాన్ మాసం సందర్భంగా ప్రార్ధనలకు వీలుకల్పిస్తున్నామని అయితే అక్కడ కూడా అందరూ సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే కోరారు.
ఎం ఎస్ సుధాకర్, సత్యం న్యూస్