మాకు ఫిర్యాదులు రావడం లేదు. మేం పంచిపెట్టిన డబ్బు అంతా లబ్దిదారులకు చేరిపోయింది అని అనుకుంటున్నది ప్రభుత్వం. ప్రభుత్వ అధికారులు కూడా అదే చెబుతున్నారు. అయితే ప్రజలు మాత్రం లబోదిబో మంటున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని సదుద్దేశంతో ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు రూపాయలు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
కానీ ఆచరణకు వచ్చేసరికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 1500 రూపాయలు వస్తే పేద ప్రజలు నిత్యావసర సరుకులకు ఇతర ఖర్చులకు పనికి వస్తాయని చాలామంది ఆశించారు. అయితే చాలా మందికి తమ బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ కాలేదు.
అందరికీ ఆహార భద్రత కార్డు లేకపోవడం బ్యాంకు ఖాతా వివరాలు లేకపోవడం వలన డబ్బులు జమ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి ఫిర్యాదులు ఉంటే పౌరసరఫరాల శాఖ సహాయం చేస్తుందని కొన్ని నెంబర్లు ఇచ్చారు. కానీ అందులో ఈ నెంబరు రింగ్ అవుతుంది గాని ఎవరు సమాధానం ఇచ్చే వారే లేరు.
పేరుకు మాత్రమే ఈ నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్ లు ఇవే: 1967, 040-23324614 ,23324615, పేద ప్రజలు తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి బ్యాంకులకు వెళ్లాలి. అక్కడ పెద్ద క్యూ ఉంటున్నది. తీరా బ్యాంకులో డబ్బు రాలేదని తెలుసుకున్న తర్వాత అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే ఎంతో దూరం ప్రయాణం చేస్తే కానీ ఉన్నతాధికారుల కార్యాలయాలు ఉండటం లేదు.
పోనీ మండల్ ఆఫీసులకు వెళ్లాలనుకుంటే కరోనా భయం ఉంది. ఇబ్బందులు పడుకుంటా వెళ్దామా అనుకుంటే గ్రామం దాటి వెళ్ళద్దు అని పోలీసులు హుకుం జారీ చేశారు. మా దిక్కెవరు అని వేచి చూస్తున్నారు ప్రజలు. బ్యాంకు ఖాతాలు లేనివారికి తపాలా శాఖ ద్వారా కూడా నగదును పంపిణీ చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.
ఏదైనా సమస్య ఉంటే పోస్టాఫీసుకు వెళితే అక్కడ బయోమెట్రిక్ తీసుకుని వెంటనే డబ్బు ఇస్తారని తెలిపారు. రేషన్ కార్డు లేని పేదలకు కూడా సాయం అందిస్తామని తెలిపారు. తెలంగాణలో 5.21 లక్షల మందికి పైగా రేషన్ కార్డు లేవని వారికి ఇవ్వాల్సిన రూ. 78.24 కోట్ల మొత్తాన్ని తపాలా శాఖలో జమ చేసినట్టు చెప్పారు.