విజయనగరంలోని గిరీశం పాఠశాలలో చదువుతూ, కరాటేలో విశేష ప్రతిభ కనబర్చి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్ధులను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
పంజాబ్ లోని చండీఘర్ యూనివర్సిటీలో ఈ నెల 20 నుండి 26 వరకు జరగనున్న జాతీయ కరాటే చాంపియన్ పోటీలకు నగరంలోని గిరీశం పాఠశాల విద్యార్ధులు ఎం. రేవంత్ సుశీలాష్, వి. లక్ష్మీనారాయణలు ఎంపికైనట్లుగా గిరీశం పాఠశాల ప్రిన్సిపాల్ పి. ధనుంజయరావు తెలిపారు.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుండి నలుగురు విద్యార్ధులు ఎంపిక కాగా, వారిలో ఇద్దరు తమ పాఠశాలకు చెందిన విద్యార్ధులు ఉన్నారన్నారు. ప్రస్తుతం కోచ్ పి. సాగర్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్ధులు జిల్లా ఎస్పీ రాజకుమారిని డీపీఓ లో కలిసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి విద్యార్ధులు ఎం. రేవంత్ సుశీలాస్, వి. లక్ష్మీ నారాయణలను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 20 నుండి చండీఘర్ లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి, జిల్లాకు మంచి పేరును తీసుకొని రావాలన్నారు.
గతంలో కూడా శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కూడా ఈ విద్యార్థులు పాల్గొని, పతకాలను సాధించినట్లుగా పాఠశాల చైర్మన్ ఎ. ఏడుకొండలు ఎస్పీకి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, డీసీఆర్ బి సీఐ బి.వెంకటరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.