మహారాష్ట్రతో సహా వివిధ ప్రాంతాలకు జీవనోపాధి నిమిత్తం వెళ్లి లాక్ డౌన్ నేపథ్యంలో స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలు విధిగా స్వీయ నిర్బంధంలో ఉండాలని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ అన్నారు. శుక్రవారం కట్టంగూరు, శాలిగౌరారం మండలాల పరిధిలోని దుగునెల్లి, మునుకుంట్ల, శాలిగౌరారం తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
ఇతర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు వచ్చిన ప్రజలతో ఆయన కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి స్వగ్రామాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ విధిగా 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని సూచించారు.
వలస కార్మికులు భారీ సంఖ్యలో స్వగ్రామాలకు తిరిగి వస్తున్నందున గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులను ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏ ప్రాంతం నుండి ఎంత మంది స్వగ్రామాలకు వచ్చారో స్థానిక మండల స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించండి
ఇప్పటి వరకు సుమారు 3,500 మంది ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చినట్లుగా తమకు సమాచారం ఉన్నదని, చెక్ పోస్టుల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా 1800 మంది వచ్చినట్లుగా తెలుస్తుందని, ఇతర మార్గాల ద్వారా కూడా వచ్చి ఉంటారనే కోణంలో గ్రామాల వారీగా వివరాలు సేకరించడంతో సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు.
మహారాష్ట్ర, గుజరాత్ తదితర ప్రాంతాల నుండి తిరిగి వచ్చిన కూలీలు వారు వచ్చిన ప్రాంతాలలో కరోనా ప్రభావం అధికంగా ఉన్నందున విధిగా గృహనిర్బంధంలో ఉండి వ్యాధి వ్యాప్తి చెందకుండా సహకరించాలని ఆయన కోరారు. మొదట విదేశాల నుండి తిరిగి వచ్చిన వారి ద్వారా, తర్వాత మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా, తాజాగా ఇప్పుడు స్వస్థలాలకు వచ్చిన కూలీలతో వ్యాప్తి చెందుతున్నదని చెప్పారు.
గ్రామాలకు తిరిగి వచ్చిన వారికి కావాల్సిన నిత్యావసరాలను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నందున బయట తిరగకుండా ఉండాలని కోరారు. గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు సమన్వయంతో వ్యవహరించి కరోనా వ్యాప్తిని నివారించేలా సహకరించాలని ఎస్పీ రంగనాధ్ సూచించారు.
ఎస్పీ వెంట నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, నకిరేకల్ రూరల్ సి.ఐ. పి. నాగ దుర్గాప్రసాద్, కట్టంగూర్ ఎస్.ఐ. జి. కరుణా ప్రసాద్, కట్టంగూరు ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, ఎంపీడీవో భూక్యా యాకుబ్ నాయక్, తహసిల్దార్ ఇంద్రపల్లి హుస్సేన్ లతో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.