కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై ఆ మధ్య కాలంలో వంటికాలిపై లేచిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆ పని చేయడం లేదు. ఎందుకో అర్ధం కావడం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే రాజకీయంగా కీలకమైన జమిలీ ఎన్నికలపైన ఆయన ఇప్పటి వరకూ స్పందించలేదు. అదే విధంగా భారత్ పేరు మార్పు అంశంపై కూడా ఆయన స్పందించలేదు. భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్.. అసలు విషయాలను దాట వేశారు. బీసీ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని లేఖలు రాశారు కానీ.. ఈ కీలక అంశాలపై తమ పార్టీ విధానం ఏమిటో మాత్రం ఎంపీలకు చెప్పలేదు. పార్లమెంటులో చర్చకొస్తే ఏం చేయాలి..? అన్నది బీఆర్ఎస్కు సమస్యగా ఉన్నది.
ఇటీవల మారిన రాజకీయ పరిణామాల రీత్యా కమలానికి గులాబీ దగ్గరవుతోందని అంటున్నారు. మేం తటస్థం అని ఎంత చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూడా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియా కూటమికి కాకుండా ఆయన బీజేపీ వైపే ఉంటారనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. అయితే బీఆర్ఎస్ జమిలి ఎన్నికలకు, భారత్ పేరు మార్పునకు జై కొడితే… బీజేపీకి అది మరింత సాగిలబడిందనే సంకేతాలు వెలువడతాయి.
జమిలీ ఎన్నికలొస్తాయనే వార్తలు, ఊహాగానాలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం మూణ్నెల్ల ముందే తొందరపడి తొలి జాబితాను ప్రకటించటంతో బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకు కేంద్రం పచ్చజెండా ఊపితే… కొత్త సమస్యలు వస్తాయి.
దీనిపై ఎలా స్పందించాలో కేసీఆర్ నిర్ణయించుకోలేకపోయారు. పార్లమెంట్ లో ఏ బిల్లులు పెడతారో తెలియదు కాబట్టి… తొందర ఎందుకని వేచి చూద్దామని కేసీఆర్ అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారనే వాదనలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నది.