సుప్రసిద్ధ సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మద్రాస్ హైకోర్టుకు న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా వీరిలో మాలా, ఎస్.సౌందర్ల పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. శ్రీశ్రీ సరోజ దంపతుల నలుగురి సంతానంలో చిన్నవారైన మాలా మద్రాస్ లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. ఆమె 1989లో మద్రాస్-పుదుచ్చేరి బార్ అసోసియేషన్లో సభ్యురాలిగా నమోదయ్యారు.
32 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న మాల, 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాలా భర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నతాధికారిగా ఉన్నారు. మాలా రాధారమణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శ్రీనివాస్ జయప్రకాశ్ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు.