సరిహద్దు వివాదాల విషయంలో ఇతర దేశాల ప్రభావం లేకుండా చైనా వ్యవహరించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కోరారు. చైనా మంత్రి వాంగ్ యీ తో మూడు గంటలపాటు జరిగిన చర్చల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్ వైపు మొగ్గు చూపే విధంగా ప్రవర్తించడం మంచిది కాదని ఆయన చైనాకు సలహా ఇచ్చారు. కాబూల్ లో పర్యటన అనంతరం వాంగ్ యీ న్యూఢిల్లీ వచ్చారు.
తర్వాత NSA చీఫ్ అజిత్ దోవల్ను ఆయన కలిశారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో చర్చలు జరిపారు. అజిత్ దోవల్ను వాంగ్ యీ చైనా పర్యటనకు ఆహ్వానించారు. తక్షణ సమస్యలు పరిష్కరించిన తర్వాత చైనాలో పర్యటిస్తానని దోవల్ వాంగ్తో చెప్పారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణ వాతావరణం వెంటనే తొలగించాలని దోవల్ కోరారు. “కాశ్మీర్ అంశం సుదీర్ఘంగా చర్చించబడిన అంశం. భారత్కు సంబంధించి చైనా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుందని, తమ విధానాన్ని ఇతరుల ప్రభావితం చేయకూడదని మేము ఆశిస్తున్నాము, ”అని మంత్రి జైశంకర్ అన్నారు.
“సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత ఉండేలా ఇరుపక్షాలు చూడాలని అప్పుడే ద్వైపాక్షిక సంబంధాలపై ముందుకు సాగడానికి వీలుకలుగుతుందని ఆయన అన్నారు. సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో సైన్యం అసాధారణంగా ఉనికిలో ఉన్నంత వరకు ద్వైపాక్షిక అంశాలలో సాధారణం పరిస్థితి వచ్చే వీలులేదు,” అన్నారాయన. భారత్ చైనా కలిసి పని చేస్తే ప్రపంచం మొత్తం దృష్టి తమపైనే ఉంటుందనే విషయాన్ని చైనా గుర్తుంచుకోవాలని మంత్రి జైశంకర్ అన్నారు.