చైతన్య సారధి ట్రస్ట్ ద్వారా ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం పెద్దగోపతి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి చదువుతున్న వాసిరెడ్డి ఉనికి తాను పొడుపుచేసుకున్న డబ్బుతో ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుచేసి, ల్యాబ్ టీచర్ తో నిర్వహణ చేయించడం అభినందనీయమని అన్నారు. పోటీ ప్రపంచంలో కంప్యూటర్ అన్ని రంగాలను శాసిస్తున్నదని, కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు. కంప్యూటర్ తరగతి నిర్వహించాలని ఆయన అన్నారు. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం గురించి ప్రశ్నలు వేసి, సమాధానం రాబట్టారు. బిల్ గేట్స్ చిన్నతనంలో తన పాఠశాలలో ఉన్న ఒకే ఒక్క కంప్యూటర్ ని సద్వినియోగం చేసుకొని, ప్రపంచంలో గొప్ప ప్రొగ్రామర్ గా, ధనవంతునిగా మారిన ఉదాహరణను విద్యార్థులకు ఉదహరించారు. ఇష్టంగా, పట్టుదలతో అభ్యాసన చేయాలని, అప్పుడే రాణించగలుగుతామని అన్నారు.
ఈ సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్ ప్రదాత ఉనికి, శిక్షణలో ఉన్నతంగా రాణించిన విద్యార్థికి ల్యాప్ టాప్ బహూకరించనున్నట్లు ప్రకటించారు. అనంతరం 6వ తరగతి గదిలో విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమ ప్రగతిని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు పదాలు పలకడం, అక్షరాల తేడాను గుర్తించడం అడిగి తెలుసుకున్నారు. కష్టమైన పదాలు, పదాల కూర్పుపై శిక్షణ ఇవ్వాలన్నారు. పాఠశాలలో రూ. 12.76 లక్షలతో చేపడుతున్న మన ఊరు-మన బడి పనుల పురోగతిని పరిశీలించారు. మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.