ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామంలో రూ. 151.20 లక్షల వ్యయంతో నిర్మించిన 30 డబల్ బెడ్ రూం ఇండ్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న పాపటపల్లి గ్రామం ఇప్పుడు ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా రూపుదిద్దుకున్నదని అన్నారు. గ్రామంలో సిసి రోడ్లు లేని వీధి లేదని, అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. డబల్ బెడ్ రూం ఇండ్లు వచ్చిన వారు అదృష్టవంతులని, ప్రక్కనే రైతు వేదిక, పార్క్, రోడ్డుకు అనుకోని గ్రామంలోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఇంకా కట్టని 5 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేస్తామన్నారు. ఇజిఎస్, సుడా, తన నిధులతో రఘునాథపాలెం మండలంలో ఈ ఒక్క సంవత్సరం లోనే రూ. 12 కోట్లతో సిసి రోడ్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.
ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా, 24 గంటల కరంట్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో జరిగిన ప్రగతి గురించి ప్రగతి నివేదిక తయారుచేయాలని ఆయన అన్నారు. అభివృద్ధి పనులతో గ్రామాల రూపురేఖలు మారాయని మంత్రి అన్నారు. అంతకుముందు మంత్రి విఆర్ బంజర గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్, డ్రైనేజిలకు, పాపటపల్లి గ్రామంలో రూ. 80 లక్షలతో నిర్మించిన సిసి రోడ్స్, డ్రయినేజీలు ప్రారంభోత్సవం చేశారు.