అంజనీ ఫ్యాక్టరీ, బుగ్గ మాధారం రహదారి గుంతలను మరమ్మతులు చేయాలని,రోడ్డుకి ఇరువైపులా ఉన్న కంపచెట్ల తొలగించాలని బీజేపీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలంలోని అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి బుగ్గ మాధారం వెళ్ళే రహదారిలో భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని చింతలపాలెం మండల బిజెపి ఆధ్వర్యంలో రహదారిపై నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఈ రహదారి గుండా నిత్యం భారీ వాహనాలు అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీకి వస్తుంటాయని, పులిచింతల ప్రాజెక్ట్ జెన్కో ఉద్యోగులు కూడా ఇదే రహదారి గుండా వెళ్తారని అన్నారు.
పులిచింతల ప్రాజెక్ట్ సందర్శించడానికి అనేకమంది సందర్శకులు నిత్యం ఇదే రహదారి గుండా వస్తుంటారని, ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా రోడ్డుపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చి, రహదారికి ఇరువైపుల ఉన్న కంపచెట్లు తొలగించాలని కోరారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల దళిత మోర్చా అధ్యక్షుడు చిత్రాల కిషోర్, బిజెపి మండల నాయకులు వేములురి శీను, బాబు తదితరులు పాల్గొన్నారు.