కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితుల్లో నేటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
నేడు ఆయన తిరుపతి లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ లో పర్యటించారు. స్థానికంగా అర్హులైన కుటుంబాలకు ఇల్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. దాదాపు 30 వేల కోట్ల కేంద్ర నిధులతో నిర్మించిన గృహాలను పేదలకు కేటాయించకుండా ఖాళీగా ఉంచడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.
వేల రూపాయలు ప్రభుత్వానికి కట్టి పలు దఫాలుగా ప్రభుత్వం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగితున్నా ఇల్లు కేటాయించలేదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. దాదాపు 30 వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులతో మంజూరు చేసి నిర్మించిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయకుండా ఖాళీగా ఉంచడం ఏంటి ? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
గత 7 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల 38 వేల ఇళ్లు కేంద్రం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం 30 వేల 936 కోట్లు అర్బన్ హౌసెస్ కి ఏపి కి కేటాయించిందని ఆయన వెల్లడించారు. ఐదేళ్ల టిడిపి పాలనలో రెండేళ్ల వైయస్సార్సీపి పాలనలో కేవలం 10110 కోట్లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం తరఫున కేంద్రం నుండి తీసుకున్నారని ఆయన తెలిపారు.
అందులో కూడా 6868 కోట్లు మాత్రమే ఉపయోగించారని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం చేతకానితనానికి ఇదే నిదర్శనం అని ఆయన అన్నారు.