పేద ప్రజలపై భారంగా ఉన్న ప్రభుత్వ జీవో 131,ఎల్. ఆర్. యస్. విధానాన్ని సవరించాలని సి.పీ.ఐ.యం. జిల్లా నాయకులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం నాడు సి.పీ.ఐ.యం. ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్. ఆర్. యస్. పేరుతో కొత్త గా బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలపై ఊహించని విధంగా పన్ను విధించడం విచారకరమని అన్నారు.
పేదలు ఎన్నో కష్టాలు పడి ఎప్పుడో కొనుగోలు చేసిన ఇంటి ప్లాట్లను 131జీవో ద్వారా 45రోజుల లో క్రమబద్ధీకరణ చేసుకోవాలని అనడం సమంజసం కాదని విమర్శించారు. ఇలాంటి చర్యలు ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాజకీయాలకు అతీతంగా ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, మండల నాయకులు పామనుగుల్ల అచ్చాలు, నార్కట్ పల్లి వైస్ యం.పీ.పీ.కల్లూరి యాదగిరి, నారబోయిన శ్రీనివాసులు, ఐతరాజు నర్సింహ, జిట్ట సరోజ, రుద్రారపు పెద్దులు, మద్ది లింగయ్య, యాదయ్య, స్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.