విద్యార్థులు మత్తు పదార్ధాలతో చిత్తు కావద్దని విద్యార్థులకు విజయనగరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని విజయనగరం వన్ టౌన్ సీఐ డా.బి.వెంకటరావు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించేందుకు గాను విజయనగరం పట్టణంలోని బి.పి.ఎం. పాటశాల విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ డా. బి.వెంకటరావు మాట్లాడుతూ – మత్తు పదార్థాలకు అలవాటు పడితే విచక్షణ కోల్పోయి, తామేమీ చేస్తున్నామన్న విషయం మరిచి, నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.
విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు కలిగించే గంజాయి, హెరాన్, నల్ల మందు, మద్యం, డ్రగ్స్ బారిన పడవద్దాన్నారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకున్న, చక్కగా విద్య మీద దృష్టి పెట్టి, తల్లిదండ్రుల కలలను నిజం చేయాలన్నారు. ఎవరైతే క్రమ శిక్షణతో నడుచుకొంటూ, ఉన్నతమైన చదువులతో ముందుకు వెళ్తారో వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. ఉన్నతమైన లక్ష్యాలతో మంచి స్థానాలకు చేరుకున్న వారికి సమాజంలో గౌరవం లభిస్తుందని, తద్వారా మీ తల్లిదండ్రులకు, మీరు నివసిస్తున్న ప్రాంతానికి, దేశానికి మంచి ఖ్యాతి లభిస్తుందన్నారు.
ప్రతీ ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, లక్ష్య సాధనకు కృషి చెయ్యాలని సీఐ డా. బి.వెంకటరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ ఎస్.భాస్కరరావు, బి.పి.ఎం.పాఠశాల విద్యా ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వన్ టౌన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.