గాంధీ సినిమాను అన్ని పాఠశాలల విద్యార్దినీ, విద్యార్థులు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. పాల్వంచ పట్టణంలోని వెంకటేశ్వర సినిమా థియేటర్ లో ప్రదర్శిస్తున్న గాంధీ సినిమాను విద్యార్థులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈనెల 24 వ తేదీ వరకు జిల్లాలోని 14 సినిమా ధియేటర్లలో జాతిపిత మహాత్మా గాంధీ చలన చిత్రాన్ని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్ధులకు ఉచితంగా ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు.
సినిమా థియేటర్లులో ఏర్పాట్లును విద్యా, తహసీల్దార్లు, ఎంపిడీవోలు, పోలీస్, మున్సిపల్ కమిషర్లు ఎప్పటికపుడు పరిశీలన చేయాలని చెప్పారు. జిల్లాలోని 14 థియేటర్లు లో ప్రతి రోజు 8 వేలకు. పైగా విద్యార్థులు వీక్షణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు సినిమా ప్రారంభం అవుతుందని చెప్పారు.
విద్యార్థులు క్షేమంగా తిరిగి వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈ నెల 24 వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి మధ్నాహ్నం 1.30 గంటల వరకు గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు తమ పాఠశాలల్లోని విద్యార్ధులందరూ చిత్రాన్ని వీక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.