పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్బాగ్లో గత రెండు నెలల నుంచి ఆందోళనకారులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ నిరసన ప్రదర్శన వల్ల ఢిల్లీలో రాకపోకలు ఇబ్బందిగా మారాయి. ఆందోళనకారులు రోడ్డుపైన టెంట్లు వేసుకోవడం వల్ల ట్రాఫిక్ జామవుతున్నది. స్థానికంగా వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. అయితే ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు ఓ పిటిషన్పై వాదోపవాదాలు విన్నది.
నిరసన అనేది ప్రాథమిక హక్కు అని, కానీ ఆందోళనకారులు తమ ప్రదర్శన స్థలాన్ని మరో చోటుకు మార్చే వీలు లేదా అని కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. నిరసనకారులను మరో చోటుకు పంపేందుకు ఇద్దరు సీనియర్ న్యాయవాదులను మధ్యవర్తిగా నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. అడ్వకేట్లు సంజయ్ హెగ్డే, సాధనా రామచంద్రన్లు.. ఆందోళనకారులతో చర్చలు నిర్వహించనున్నారు. నిరసనకారులను మరో ప్రదేశానికి తరలించేందుకు ఆ ఇద్దరూ వారిని ఒప్పించనున్నారు.