సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు నేతాజీ ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్లోని యాదవ్ల ప్రాబల్యం ఉన్న మెయిన్పురి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతున్నది. రేపు జరిగే ఈ ఉప ఎన్నిక పోలింగ్ లో శాక్య ఓటర్ల పాత్ర అత్యంత కీలకమైంది. మెయిన్పురి పార్లమెంటు స్థానంలో దాదాపు 17 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో దాదాపు 4.5 లక్షల మంది యాదవ ఓటర్లు ఉన్నారు.
దీని తర్వాత, శాక్య ఓటర్లను రెండవ నంబర్గా పరిగణిస్తారు. వీరి సంఖ్య మూడు లక్షలు. మెయిన్పురి పార్లమెంటరీ స్థానానికి ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అలోక్ శాక్యాను ప్రకటించింది. అలోక్ శాక్యా ఉత్తరప్రదేశ్లోని అఖిలేష్ ప్రభుత్వంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఉన్నారు. భోగావ్ అసెంబ్లీ స్థానం నుంచి 2002, 2007 మరియు 2012లో అలోక్ శాక్యా వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించారు.
ఆయన తండ్రి రామౌతర్ శాక్యా కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మెయిన్పురి లోక్సభ స్థానంలో వెనుకబడిన తరగతుల ఓటర్లు మెజారిటీగా ఉన్నారు. అందులో 45% ఓటర్లు యాదవ్ సామాజికవర్గానికి చెందినవారు. ఈ కుల సమీకరణం కారణంగా లోక్ సభ ఉప ఎన్నికల్లో శాక్య ఓటర్ల మద్దతు ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. 2014 ఉప ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే వ్యూహాన్ని ప్రయోగించింది. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ప్రేమ్ సింగ్ శాక్యాను అభ్యర్థిగా చేసింది.
అధికారంలోకి రాక ముందు ప్రజలు “గూండాలు, భూకబ్జాదారుల” భయంతో జీవించేవారని, మహిళలు తమ ఇళ్లలో నుండి బయటకు రావడానికి భయపడేవారని, కానీ ఇప్పుడు ప్రజలను భయపెట్టడం సాధ్యం కాదని బిజెపి నాయకుడు అన్నారు. అధికార భారతీయ జనతా పార్టీ శాక్య ఓటర్ల ప్రాతిపదికన గెలిచేందుకు ప్రయత్నిస్తున్నది. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ శాక్య ఓటర్లకు దగ్గరగా ఉన్నందున గెలుపుపై ధీమాగా ఉన్నది.
తన కులానికి చెందిన ఓట్లను బీజేపీకి అనుకూలంగా సమీకరించే పనిలో నిమగ్నమై ఉన్నానని బీజేపీ రాజ్యసభ ఎంపీ గీతా షాక్యా చెప్పారు. ఇప్పటి వరకు, ఏ రాజకీయ పార్టీ కూడా శాక్య ప్రాబల్యం ఉన్న ప్రాంతం నుండి ఈ కులానికి చెందిన ఎవరినీ రాజ్యసభకు పంపలేదు. నేతాజీ ములాయం సింగ్ యాదవ్ మరణానంతరం ఆయన స్థానమైన మెయిన్పురిలో గెలిచేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.
మెయిన్పురి పార్లమెంటరీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పెద్ద వ్యూహంతో ఉంది. కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బలమైన శాక్య అభ్యర్థికే టిక్కెట్టు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ములాయం సింగ్ యాదవ్ తర్వాత ఇప్పుడు మెయిన్పురి సీటుపై సమాజ్వాదీ కుటుంబం ప్రభావం తగ్గుతుందని, ఇది బీజేపీ అభ్యర్థికి లాభించవచ్చని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అయితే అందుకు భిన్నంగా నాయకుడి మరణానంతరం సానుభూతి ఓట్లు డింపుల్ ఖాతాలోకి వెళ్తాయని సోషలిస్టు నేతలు భావిస్తున్నారు.