అమెరికాలోని ఫిలడెల్ఫియా లో నేటి నుంచి 9 వరకు జరిగే తానా సభల్లో పాల్గొనవలసిందిగా నిర్వాకుల నుంచి ఆహ్వానం రావడంతో ఎన్ .టి .ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ బయలుదేరారు. తానా సభల తరువాత జనార్దన్ కోసం అమెరికాలో వున్న కమిటీ సభ్యులు అట్లూరి అశ్విన్ మరికొన్ని రాష్ట్రాల్లో సభలను ఏర్పాటు చేశారు.
వాటిల్లో కూడా జనార్దన్ గారు పాల్గొని ప్రసంగిస్తారు. జనార్దన్ అమెరికా వెడుతున్న సందర్భంగా కమిటీ సభ్యులు వారిని కలసి పుష్పగుచ్చంతో వీడ్కోలు పలికారు. మహానటుడు, నాయకుడు ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా జనార్దన్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటయింది.
అదే ఎన్ .టి .ఆర్ .సెంటినరీ సెలెబ్రేషన్స్ సావనీర్ అండ్ వెబ్సైటు కమిటీ. ఈ కమిటీ నేతృత్వంలో ఏప్రిల్ 28న విజయవాడలో జరిగిన భారీ బహిరంగ సభలో తెలుగు దేశం పార్టీ జాతీయ నాయకులు చంద్ర బాబు నాయుడు, సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ , జర్నలిస్ట్ వెంకటనారాయణ పాల్గొన్నారు. ఈ సభలో ఎన్ .టి .ఆర్ .శాసనసభ ప్రసంగాలు , ఎన్ .టి .ఆర్. చారిత్రిక ప్రసంగాల గ్రంధాలను ఆవిష్కరించారు.
మే 20న హైద్రాబాద్ లో జరిగిన బహిరంగ సభలో శకపురుషుడు , ప్రత్యేక సంచిక , జై ఎన్ .టి .ఆర్ .వెబ్సైటు ఆవిష్కరించారు. ఈ సభలో చంద్ర బాబు నాయుడు, గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీతారాం ఏచూరి, డి. రాజా, దగ్గుబాటి పురందేశ్వరి, బాలకృష్ణ, మురళి మోహన్, రామ చరణ్, నాగ చైతన్య పాల్గొన్నారు.
ఈ రెండు సభలను అత్యద్భుతంగా నిర్వహించిన చైర్మన్ జనార్దన్ ని, మిగతా కమిటీ సభ్యులను చంద్ర బాబు నాయుడు, బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ .టి .ఆర్ . సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ చేసున్న కార్యక్రమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది . ఇప్పుడు అన్న ఎన్ .టి .ఆర్ 100 అడుగుల విగ్రహాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టించాలని సంకల్పంతో కమిటీ పనిచేస్తోంది .